వారికి మా మద్దతు ఉంటుంది

6 Jan, 2018 05:54 IST|Sakshi
సూర్యతో ముచ్చటిస్తున్న కీర్తీసురేశ్‌

తమిళసినిమా: వారికి మన మద్దతు ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు నటుడు సూర్య.ఆయన నటిస్తున్న తాజా చిత్రం తానాసేర్న్‌ద కూట్టం. నటి కీర్తీసురేశ్‌ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ గురువారం సాయంత్రం స్టానిక తేనాంపేటలోని నక్షత్ర హోటల్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొన్న చిత్ర కథానాయకుడు సూర్య మాట్లాడుతూ తనకు దర్శకుల మాదిరిగానే నిర్మాతలు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. అలాంటి వారిలో  ఈ చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజా ఇంకా ముఖ్యం అన్నారు. తాను తీసుకునే మంచి నిర్ణయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంలో చాలా సలహాలు, సూచనలు ఇస్తుంటారన్నారు. తను విఘ్నేశ్‌శివన్‌ దర్శకత్వంలో నటిస్తున్నానని చెప్పగానే దర్శకుడు హరి కచ్చితంగా ఆయనతో చిత్రం చేయమని అన్నారన్నారు.

అదే విధంగా తన కుటుంబంలోని అందరూ విఘ్నేశ్‌శివన్‌తో చిత్రం చేస్తున్నానంటే సంతోషించారని తెలిపారు. తానాసేర్న్‌ద కూట్టం చిత్రం1987లో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కినా, చిత్రం కొత్త కోణంలో ఉంటుందని చెప్పారు. చిత్రం అనుకున్నప్పటి నుంచి టైటిల్‌ నిర్ణయించిన వరకూ అన్నీ చక్కగా అమిరాయని అన్నారు.చిత్రంలోని పాటలన్నీ బాగా వచ్చాయని, ఏడేళ్లు తరువాత తాను నటించిన చిత్రం సంక్రాంతికి విడుదల కావడం సంతోషంగా ఉందని అన్నారు. ముందుగా సూర్య పేర్కొంటూ నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మన రంగం నుంచి వేరే రంగంలోకి పయనాన్ని ప్రారంభించిన రజనీకాంత్, కమలహాసన్, విశాల్‌లకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, వారికి మన ఆదరణ మద్దతు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కీర్తీసురేశ్, రమ్యకృష్ణ, దర్శకుడు విఘ్నేశ్‌శివన్, నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు