ఢాకా: స్పిన్నర్లు షకీబ్ అల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్ రాణించడంతో... ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ ఆధిక్యంలో ఉంది. ఆట రెండో రోజు సోమవారం ఓవర్నైట్ స్కోరు 18/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియాను షకీబ్, మెహదీ దెబ్బ తీశారు. ఫలితంగా ఆసీస్ 74.5 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ 68 పరుగులిచ్చి 5 వికెట్లు, మెహదీ హసన్ 62 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు.
43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన బంగ్లాదేశ్... రెండో ఇన్నింగ్స్లో నెమ్మదిగా ఆడుతోంది. 22 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 45 పరుగులు సాధించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఓవరాల్గా 88 పరుగుల ఆధిక్యంతో ఉంది. తమీమ్ ఇక్బాల్ (30 బ్యాటింగ్), నైట్వాచ్మన్ తైజుల్ ఇస్లాం పరుగులేమీ చేయకుండా క్రీజ్లో ఉన్నారు.