ఫైనల్లో సైనా, సమీర్‌ వర్మ

25 Nov, 2018 02:01 IST|Sakshi

సాత్విక్‌–చిరాగ్, సిక్కి–అశ్విని జోడీలు కూడా 

సయ్యద్‌ మోదీ బ్యాడ్మింటన్‌ టోర్నీ

లక్నో: భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు సైనా నెహ్వాల్, సమీర్‌ వర్మ సయ్యద్‌ మోదీ స్మారక వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నమెంట్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరితో పాటు పురుషుల డబుల్స్‌లో తెలుగబ్బాయి సాత్విక్‌ సాయిరాజ్‌ రాంకిరెడ్డి–చిరాగ్‌ శెట్టి, మహిళల డబుల్స్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీలు కూడా తుదిపోరుకు అర్హత సాధించాయి. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో రెండో సీడ్‌ సైనా 12–21, 21–7, 21–6తో రుసేలి హర్తవాన్‌ (ఇండోనేసియా)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో మూడో సీడ్‌ సమీర్‌ వర్మ 21–13, 17–21, 21–8తో చికో ద్వి వార్దోయో (ఇండోనేసియా)పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. దీంతో సమీర్‌ వర్మ ఏడాది ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. నేడు జరుగనున్న ఫైనల్లో ఆరో సీడ్‌ లూ గాంగ్జూ (చైనా)తో సమీర్‌... హాన్‌ యు (చైనా)తో సైనా తలపడనున్నారు.   

అదరగొట్టిన సాత్విక్, సిక్కి... 
పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి జోడీ 22–20, 25–23తో లండన్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేతలు మథియాస్‌ బో–కార్‌స్టెన్‌ మోగెన్‌సన్‌ (డెన్మార్క్‌) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్‌ సెమీస్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 21–18, 21–16తో ఎకతెరీనా బొలోతోవా–అలీనా దవ్లెతోవా (రష్యా) జోడీపై నెగ్గింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌లో సాత్విక్‌–అశ్విని ద్వయం ఓడింది. 

మరిన్ని వార్తలు