మహిళా బాక్సర్ల సూపర్‌ షో

23 Nov, 2017 00:16 IST|Sakshi

యూత్‌ ప్రపంచ బాక్సింగ్‌లో 7 పతకాలు ఖాయం

గువాహటి: మహిళల యూత్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఏడుగురు బాక్సర్లు సెమీస్‌ చేరడంతో భారత్‌కు ఏడు పతకాలు ఖాయమయ్యాయి. జ్యోతి గులియా (51 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు), నీతూ (48 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు)లు బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ బౌట్స్‌లో విజయం సాధించారు. దీంతో సెమీస్‌ చేరిన వీరికి ఓడినా... కనీసం కాంస్యమైనా దక్కుతుంది. నేహా యాదవ్‌ (ప్లస్‌ 81 కేజీలు), అనుపమ (81 కేజీలు) ఇది వరకే సెమీస్‌ చేరారు.
క్వార్టర్‌ ఫైనల్స్‌లో గియోవాని మార్చిసి (ఇటలీ)పై జ్యోతి; సందుగష్‌ అబి

ల్‌ఖన్‌ (కజకిస్తాన్‌)పై శశి చోప్రా; రెబెకా నికోలి (ఇటలీ)పై అంకుశిత; మాక్సి క్లోట్‌జెర్‌ (జర్మనీ)పై నీతూ; లూ జియా (చైనా)పై సాక్షి గెలిచారు. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో జార్జియా ఒకానర్‌ (ఇంగ్లండ్‌) చేతిలో తెలుగమ్మాయి గోనెళ్ల నిహారిక (75 కేజీలు)... కాన్‌సెర్‌ ఒల్టు (టర్కీ) చేతిలో అస్థా పాహ్వా (69 కేజీలు) ఓడిపోయారు. గత టోర్నీలో కేవలం ఒక్క కాంస్యాన్నే గెలిచిన భారత్‌... ఇంతవరకు స్వర్ణ పతకాన్ని గెలుపొందలేకపోయింది. ఇప్పుడు ఏకంగా ఏడు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది.

మరిన్ని వార్తలు