‘రోహిత్‌ కంటే సెహ్వాగ్‌ బెటర్‌ కానీ’

5 Jun, 2020 11:50 IST|Sakshi

సిడ్నీ: పదకొండు మంది సభ్యులతో కూడిన భారత్‌-ఆస్ట్రేలియా ఆల్‌టైమ్‌ అత్యుత్తమ వన్డే జట్టును ఆసీస్‌ క్రికెట్‌ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఎంపిక చేశాడు. గురువారం ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జట్టును ప్రకటించాడు. అయితే ఫించ్‌ ప్రకటించిన జట్టులో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరు లేకపోవడం గమనార్హం. అయితే టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనికి అనూహ్యంగా వన్డే జట్టులో అవకాశం కల్పించాడు. ఓపెనర్లను ఎంపిక చేయడానికి ఫించ్‌ తర్జనభర్జన పడ్డాడు. ఒక ఓపెనర్‌గా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ను ఎంపిక చేయగా.. అతడికి జోడిగా ఎవరిని తీసుకోవాలనేదానిపై తీవ్రంగా ఆలోచించాడు. (సోషల్‌ మీడియాకు దూరంగా ధోని..)

‘నా తొలి ప్రాధాన్యత వీరేంద్ర సెహ్వాగే. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ దూకుడుగా బ్యాటింగ్‌ చేస్తాడు. కానీ అతని ఆట ముగిసింది. దీంతో రోహిత్‌ శర్మను తీసుకుంటున్నా. అతని వన్డే రికార్డులు అత్యద్భుతం. కానీ గిల్‌క్రిస్ట్‌-సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా దిగి ఆడితే చూడాలని ఉంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడు, నాలుగు స్థానాల కోసం రికీ పాంటింగ్‌, విరాట్‌ కోహ్లిలను ఎంపిక చేస్తా.  హార్దిక్‌ పాండ్యా, ఆండ్రూ సైమండ్స్‌లు ఆల్‌రౌండర్ల స్థానాన్ని భర్తీ చేస్తారు’ అని ఫించ్‌ వివరించారు. ఇక వీరితో పాటు టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనిని కూడా భారత్‌-ఆసీస్‌ వన్డే జట్టులో ఎంపిక చేశాడు. అయితే ధోని భవిత్యంపై మాట్లాడేందకు ఫించ్‌ నిరాకరించాడు. 

‘ధోని భవిష్యత్‌పై మాట్లాడను. అతడు ఒక అద్భుతమైన ఆటగాడు. ప్రత్యర్థి జట్టులో ఉన్నప్పటికీ ధోని ఆటను ఆస్వాదిస్తుంటాను. అయితే అతని భవిష్యత్‌పై వస్తున్న వార్తలపై స్పందించలేను. ఎందుకంటే వాటి గురించి నాకు తెలియదు’ అని ఫించ్‌ అన్నాడు. ఇక బ్రాడ్‌ హాగ్‌, హర్భజన్‌ సింగ్‌లలో ఒకరిని స్పిన్నర్‌గా జట్టుతోకి తీసుకుంటానని ఫించ్‌ పేర్కొన్నాడు. బ్రెట్‌లీ, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, జస్ప్రిత్‌ బుమ్రాలతో బౌలింగ్‌ విభాగాన్ని భర్తీ చేశాడు. (విదేశాల్లో ఐపీఎల్‌-2020?)

మరిన్ని వార్తలు