షమీ మతాన్ని ప్రస్తావించిన రజాక్‌

2 Jul, 2019 17:40 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ : ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై టీమిండియా ఓడిపోవడంతో పాకిస్తాన్‌ ఆటగాళ్లు, ఫ్యాన్స్‌ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇంగ్లండ్‌పై గెలిస్తే  పాక్‌ సెమీస్‌ చేరేదని కానీ భారత్‌ కావాలనే ఓడిపోయిందని వారు విమర్శిస్తున్నారు. దీనిపై పాక్‌ మీడియా చానెళ్లు కూడా ప్రత్యేక డిబేట్‌లు పెట్టి మరింత నిప్పు రాజేస్తున్నారు. ఈ సమావేశాలో పాక్‌ మాజీ ఆటగాళ్లు తమ నోటికి పనిచెబుతూ.. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తాజాగా ఓ చర్చా కార్యక్రమంలో పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీని పొగుడుతూ అతడి మతాన్ని ప్రస్తావిస్తాడు. (చదవండి: హార్దిక్‌ను రెండు వారాలు ఇవ్వండి)

భార‌త్ ఓట‌మి పాలు కావ‌డం, పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టుకు గ‌ల అవ‌కాశాలను దెబ్బ‌తీయ‌డంపై పాక్‌ న్యూస్ ఛాన‌ల్ చర్చాకార్యక్రమం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్బంగా ఆ ఛాన‌ల్ వారు ఫోన్ఇన్‌లో అబ్దుల్ ర‌జాక్ అభిప్రాయాల‌ను సేక‌రించారు. ‘ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా వ‌రుస‌గా విజ‌యాల‌ను సాధించ‌డంలో మహ్మద్‌ షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ష‌మీ ముస్లిం కావ‌డం మ‌న‌కు మంచి విషయం. టీమిండియా మిగిలిన బౌలర్లు విఫలమైన చోట షమీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో ఓ వైపు షమీ వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచితే మిగిలిన బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు’అంటూ రజాక్‌ పేర్కొన్నాడు. 

ప్రస్తుతం రజాక్‌ వాయిస్‌గా భావిస్తున్న ఓ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. దీనిపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఆటలో మతాన్ని లాగడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. రజాక్‌ ఈ వ్యాఖ్యలతో ఏం చెప్పదల్చుకున్నాడో స్పష్టంగా అర్థమైందని మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇక పాక్‌ సెమీస్‌ చేరాలంటే బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్‌ చిత్తుగా ఓడిపోవాలి. దీంతో ప్రపంచకప్‌ రసవత్తరంగా మారుతోంది.

మరిన్ని వార్తలు