న్యూఢిల్లీ: చార్జిషీట్ దాఖలైన వారు ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) పట్టించుకోకపోవడాన్ని ప్రఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా తప్పుపట్టాడు. ఈ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పట్టుదలతో ఉండాలని సూచించాడు.
ఆదివారం జరిగిన ఐఓఏ జీబీఎంలో రెండేళ్లకు పైగా శిక్ష పడినవారినే ఎన్నికలకు దూరంగా ఉంచాలని సభ్యులు తీర్మానించిన విషయం తెలిసిందే. ‘ఇప్పటికే ఈ విషయంలో గట్టిగా ఉండాల్సిందిగా నేను ఐఓసీని అడిగాను. భారత క్రీడారంగానికి, అథ్లెట్లకు ఈ నిబంధన మేలు చేస్తుంది. ప్రత్యేక జీబీఎంకు హాజరైన ఐఓఏ సభ్యుల్లో 50 శాతం కన్నా ఎక్కువ మందిపై కోర్టులో కేసులున్న విషయం ఐఓసీ అర్థం చేసుకోవాలి. అయితే ఐఓఏ తీసుకున్న నిర్ణయం నన్ను నిరాశపరిచినా ఆశ్చర్యానికి గురి చేయలేదు. కానీ ఇంత పెద్ద దేశం ఐఓసీ నుంచి ఎందుకు సస్పెండ్ అయ్యిందని అంతర్జాతీయ ఈవెంట్స్లో పాల్గొన్నప్పుడు చాలా మంది ఇతర దేశ అథ్లెట్లు అడిగినప్పుడు అవమానంగా అనిపిస్తుంటుంది’ అని బింద్రా పేర్కొన్నాడు.