అబుదాబి టీ10 లీగ్‌లో యూవీ ?

18 Oct, 2019 12:26 IST|Sakshi

ఢిల్లీ : టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ త్వరలోనే అబుదాబిలో జరగనున్న టి10 లీగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు టోర్నమెంట్‌ చైర్మన్‌ షాజీ ఉల్‌ ముల్క్‌ తెలిపాడు. అబుదాబి వేదికగా నవంబర్‌ 15 నుంచి 24 వరకు జరగనున్న మూడో సీజన్‌ టీ10టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్నాయి. దీనికి సంబంధించి బుధవారం నిర్వహించిన ఆటగాళ్ల డ్రాఫ్టింగ్‌లో భారత్‌ నుంచి ఒక్కర్ని కూడా ఎంపిక చేయలేదు.

ఇదే విషయమై షాజీ ఉల్‌ ముల్క్‌ స్పందిస్తూ.. బీసీసీఐ నిమామాలను అనుసరిస్తూ భారత్‌ నుంచి రిటైర్‌ అయిన ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ' ఇప్పటికే ఈ విషయమై యూవీతో చర్చలు జరిపామని, టోర్నిలో అతడ్ని ఆడించేందుకు ప్రయత్నిస్తాం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాం' అని పేర్కొన్నాడు. డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూవీ కెనడాలో జరిగిన గ్లోబల్‌ టీ20 లీగ్‌లో పాల్గొని మంచి ప్రదర్శననే నమోదు చేశాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు యూవీ అంగీకరిస్తే అతని అభిమానులకు ఇది శుభవార్తే అవుతుంది. కాగా, ఈ లీగ్‌లో శ్రీలంక స్టార్‌ ఆటగాళ్లు లసిత్‌ మలింగ, తిసార పెరీర, నిరోషన్‌ డిక్‌వెల్లా, ఇంగ్లడ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ, పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ ఆఫ్రిది ఆడనున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు