‘ధోని-కోహ్లిలను కలిసే ధైర్యం చేయరు’

17 Sep, 2019 18:59 IST|Sakshi

ముంబై : భారత క్రికెట్‌లో ఫిక్సింగ్‌ భూతం మరోసారి అలజడి రేపింది. గత మూడేళ్లుగా అత్యంత విజయవంతమైన టోర్నీగా పేరుగాంచిన తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో కొందరు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెటర్లతో పాటు ఇద్దరు కోచ్‌లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణలో తేలింది. అయితే అంతర్జాతీయ క్రికెటర్‌ కూడా ఈ ఫిక్సింగ్‌ ఉన్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏసీయూ చీఫ్‌ అజిత్‌ సింగ్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘బుకీలు ఎప్పుడూ సులువైన మార్గాన్నే ఎంచుకుంటారు. ఎవరు ఈజీగా ట్రాప్‌లో పడతారో వారినే వెతుక్కుంటారు. అంతేకాని ధోని, కోహ్లి వంటి దిగ్గజాలను, క్రికెట్‌ పట్ల అంకితాభావం ఉన్నవారిని సంప్రదించే ధైర్యం చేయరు. ఎందుకంటే వారిని కలిస్తే ఏమవుతుందో బుకీలకు తెలుసు. వారిని కలిసి సమయం వృథా చేసుకోవడం కంటే డబ్బులు, మాయ మాటలకు(జాతీయ జట్టులో ఆడే అవకాశం కల్పిస్తాం) లొంగే ఆటగాళ్లను బుకీలు ఎంచుకుంటారు. ఓ స్థాయి క్రికెటర్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి తమకున్న మంచి పేరును చెడగొట్టుకోరు. బుకీలు తమకు ఏ టోర్నీ సౌలభ్యంగా ఉంటుందో అక్కడికే వెళతారు. ఇక్కడ(భారత్‌లో) సాధ్యం కాకుంటే విదేశీ టోర్నీలపై దృష్టి పెడతారు.

ఫిక్సింగ్‌లో కోచ్‌ పాత్ర గురించి..
గతంలో ఐపీఎల్‌లో చెడ్డ పేరు తెచ్చుకున్న ఫ్రాంచైజీతో కూడా ఆ కోచ్‌ కలిసి పని చేశాడు. ఆ తర్వాత ఒక రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. కనీసం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కూడా ఆడని అతను ఐపీఎల్‌ సహాయక సిబ్బందిలో ఎలా అవకాశం దక్కించుకున్నాడో, టీఎన్‌పీఎల్‌తో ఎలా జత కలిశాడో కూడా కూడా ఆశ్చర్యకరం. ఈ వివాదంలో అంతర్జాతీయ క్రికెటర్లు ఎవరూ లేరు’ అని అజిత్‌ సింగ్‌ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు