కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల జల్లు

23 Mar, 2017 19:11 IST|Sakshi
కోహ్లీపై ఆసీస్ దిగ్గజం ప్రశంసల జల్లు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసీస్ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ గొప్ప నాయకుడని, ఇప్పటికైనా ఆస్ట్రేలియా.. భారత్ జట్లు డీఆర్ఎస్ వివాదాన్ని పక్కనపెట్టి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని గిల్ క్రిస్ట్ అన్నాడు. ఈ సిరీస్‌లో ఇంకా కోహ్లీ బ్యాట్‌ నుంచి తగినన్ని పరుగులు రావాల్సి ఉంది. ధర్మశాలలో శనివారం నుంచి జరిగే  చివరి టెస్టులో కోహ్లీ తనదైన ఆట చూపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీ తన జట్టుతో పాటు మొత్తం దేశాన్ని తనతో తీసుకెళ్తాడని ప్రశంసించాడు. ధర్మశాల టెస్టులో కోహ్లీ వీరవిహారం చేస్తే ఎలా ఉంటోందనని తాను భయపడుతున్నట్లు గిల్‌క్రిస్ట్ తెలిపాడు. ఇది చాలా అరుదైన సిరీస్ అని, రెండు జట్లు జాగ్రత్తగా కూర్చుని.. ఇప్పటివరకు తాము చెప్పిన విషయాలను వేరేగా ఎలా చెప్పచ్చో ఆలోచించుకోవాలని సూచించాడు. 2008లో ఇలాంటి వివాదమే ఏర్పడి అది బాగా ఎక్కువకాలం సాగిందని, ఇప్పుడు అలా కాకుండా వీలైనంత త్వరగా ఆ వివాదాన్ని ముగించుకోవాలని అన్నాడు.

భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ శత్రుత్వంలో వివాదాలు కూడా అంతర్భాగమేనని తన కాలం నాటి ప్రముఖ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ అయిన గిల్‌క్రిస్ట్ సరదాగా చెప్పాడు. సిరీస్ అయిపోయే సమయానికి రెండు జట్ల మధ్య మంచి గౌరవభావం ఉంటుందని, రెండు జట్లు చాలా మంచి పోటీ ఇస్తాయని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత సిరీస్‌లో ఆసీస్ పెర్ఫామెన్స్ చూసి తాను చాలా ఆశ్చర్యపోతున్నట్లు తెలిపాడు. అసలు వాళ్లు ఇంత బాగా ఎలా ఆడగలిగారోనని అందరూ ఆశ్చర్యపోతున్నారన్నాడు. ఇది భలే అద్భుతమైన సిరీస్ అని, భారతదేశంలో తాము 2001 నుంచి చూసిన వాటిలో ఇదే బెస్ట్ సిరీస్ అని చాలామంది చెబుతున్నట్లు గిల్లీ చెప్పాడు.

మరిన్ని వార్తలు