సింగిల్స్‌ విజేత అదితి

19 Dec, 2017 10:39 IST|Sakshi

డబుల్స్‌లో అపూర్వ జోడీకి టైటిల్‌ ∙ఆలిండియా ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ క్లబ్‌ ఓపెన్‌ ఆలిండియా ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు సత్తా చాటారు. అండర్‌–16 బాలికల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన అండర్‌–16 బాలికల ఫైనల్లో టాప్‌సీడ్‌ అదితి ఆరే (తెలంగాణ) 6–0, 6–3తో వేద వర్షిత (తెలంగాణ)పై గెలుపొందింది. డబుల్స్‌ తుదిపోరులో అభయ వేమూరి–అపూర్వ వేమూరి (తెలంగాణ) ద్వయం 6–0, 6–3తో తనుషిత రెడ్డి–నిర్మయి సురాపూర్‌ (తెలంగాణ) జోడీపై నెగ్గి విజేతగా నిలిచింది.

బాలుర విభాగంలో కోట శశిధర్‌ సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో రన్నరప్‌గా నిలిచాడు. డబుల్స్‌ ఫైనల్లో  కోట శశిధర్‌ (తెలంగాణ)–అశ్విన్‌ భట్‌ (కర్ణాటక) జంట 1–6, 2–6తో హితేశ్‌–మానవ్‌ శ్రీకుమార్‌ (తమిళనాడు) జోడీ చేతిలో, సింగిల్స్‌ విభాగంలో శశిధర్‌ 6–7 (2/7), 6–1, 1–6తో హితేశ్‌ (తమిళనాడు) చేతిలో పరాజయం పాలయ్యాడు. అండర్‌–14 బాలుర తుదిపోరులో నితిన్‌ (ఏపీ) 6–1, 6–3తో నితీశ్‌ (తమిళనాడు)పై గెలిచాడు. బాలికల సింగిల్స్‌ ఫైనల్లో నీలా కుంకుమ్‌ (తెలంగాణ) 6–4, 3–6, 3–6తో ఇషిత (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.   

>
మరిన్ని వార్తలు