మొన్న ఏబీ...  నిన్న డు ప్లెసిస్‌... నేడు డికాక్‌  

6 Feb, 2018 00:53 IST|Sakshi
క్వింటన్‌ డికాక్‌

గాయంతో మరో సఫారీ ఆటగాడు ఔట్‌  

కేప్‌టౌన్‌: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా ప్రత్యర్థి టీమిండియా చేతిలో ఓటములతో పాటు గాయాలతోనూ విలవిల్లాడుతోంది. వన్డేల్లో కోహ్లి సేన చేతిలో వరుస పరాజయాలు... గాయాలతో కీలక ఆటగాళ్లు దూరమవడంతో సఫారీ జట్టు కుదేలవుతోంది. ఇప్పటికే ఏబీ డివిలియర్స్‌ తొలి మూడు వన్డేల్లో ఆడట్లేదు. డు ప్లెసిస్‌ ఏకంగా భారత్‌తో సిరీస్‌కే దూరమయ్యాడు. వీళ్లిద్దరు చేతి వేలి గాయాలతో సతమతమవుతున్నారు. ఇప్పుడు వికెట్‌ కీపర్‌–బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ ఈ జాబితాలో చేరాడు.

రెండో వన్డేలో బ్యాటింగ్‌ చేస్తుండగా అతని ఎడమ మణికట్టుకు గాయమైంది. దీంతో అతను మిగతా నాలుగు వన్డేలతో పాటు టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. డికాక్‌ పూర్తిగా కోలుకునేందుకు రెండు నుంచి నాలుగు వారాలు పడుతుందని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న వికెట్‌ కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ అంతర్జాతీయ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. బుధవారం కేప్‌టౌన్‌లో జరిగే మూడో వన్డేతో అతని కెరీర్‌ మొదలవనుంది. ఆరు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2–0తో ఆధిక్యంలో ఉంది. 

మరిన్ని వార్తలు