ట్రిపుల్ గురించి నాయర్ ఏమన్నాడంటే..

19 Dec, 2016 20:03 IST|Sakshi
ట్రిపుల్ గురించి నాయర్ ఏమన్నాడంటే..

చెన్నై: ఇం‍గ్లండ్‌తో చేసిన ట్రిపుల్‌ సెంచరీయే తన జీవితంలో బెస్ట్‌ ఇన్నింగ్స్‌ అని టీమిండియా యువ బ్యాట్స్మన్‌ కరుణ్‌ నాయర్‌ అన్నాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో నాయర్‌  (303 నాటౌట్; 381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) అద్భుతంగా రాణించి, వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు.

మ్యాచ్‌ నాలుగో రోజు సోమవారం ఆట ముగిసిన తర్వాత నాయర్‌ మాట్లాడుతూ.. సెంచరీ చేశాక ఒత్తిడిగా భావించలేదని చెప్పాడు. ‘సెంచరీ అయ్యాక నా శైలిలో షాట్లు ఆడా. నా మ్యాచ్‌లను చాలా వరకు నాన్న చూస్తారు. నాపై అదనపు ఒత్తిడి ఉండదు. నా ఆట చూశాక అమ్మానాన్న గర్వపడి ఉంటారు. నా జీవితంలో ఇదే అత్యుత్తమ ఇన్నింగ్స్‌. ట్రిపుల్‌ సెంచరీ చేసే క‍్రమంలో భిన్న పరిస్థితులు ఉన్నాయి. కేఎల్‌ రాహుల్‌, అశ్విన్‌, జడేజాలతో కలసి ఆడాను. నేను క్రీజులో పాతుకుపోవడానికి వారు సహకరించారు. వారికి ధన్యవాదాలు’ అని నాయర్‌ అన్నాడు.