ప్రిక్వార్టర్స్‌లో సోనియా

18 Nov, 2018 01:19 IST|Sakshi

పింకీ, సిమ్రన్‌జీత్‌ కూడా   ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 

న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు దూసుకెళ్తున్నారు. మూడో రోజు శనివారం జరిగిన అన్ని బౌట్‌లలో భారత బాక్సర్లు విజయం సాధించారు. యువ బాక్సర్‌ సోనియాతో పాటు పింకీ, సిమ్రన్‌జీత్‌ కౌర్‌లు తొలి బౌట్‌లలో సునాయాసంగా గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరారు. శనివారం 57 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్‌లో సోనియా 5–0తో దోవా తౌజనీ (మొరాకో)పై విజయం సాధించింది.

హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియాకు ఇదే తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌ కావడం విశేషం. 51 కేజీల విభాగంలో పింకీ 4–1తో అనుష్‌ గ్రిగోరియాన్‌ (అర్మేనియా)పై నెగ్గింది. 64 కేజీల విభాగంలో సిమ్రన్‌జీత్‌ 4–1తో అమేలియా మూరే (అమెరికా)ను చిత్తుచేసింది. నేడు జరుగనున్న బౌట్‌లలో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌తో సహా ఐదుగురు భారత బాక్సర్లు బరిలో దిగనున్నారు.   

మరిన్ని వార్తలు