రెండో వన్డే ముందు దక్షిణాఫ్రికాకు మరో షాక్‌

3 Feb, 2018 19:13 IST|Sakshi
డుప్లెసిస్‌ (ఫైల్‌ ఫొటో)

చేతి వేలి గాయంతో కెప్టెన్‌ డుప్లెసిస్‌ దూరం

తాత్కలిక కెప్టెన్‌గా మర్‌క్రామ్‌

సాక్షి, స్పోర్ట్స్‌ : ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్లు’ గా ఉంది దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి. ఇప్పటికే  గాయంతో తొలి మూడు వన్డేలకు సీనియర్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ దూరం అయిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆదివారం జరిగే రెండో వన్డే ముందే ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి వన్డేలో అద్భుత సెంచరీతో జట్టుకు అండగా నిలిచిన కెప్టెన్‌ డుప్లెసిస్‌ చేతి వేలి గాయంతో పూర్తి వన్డే, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.

తొలి వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా డుప్లెసిస్‌కు కుడి చేతి చూపుడు వేలు విరిగిందని, మూడు నుంచి ఆరువారాల పాటు విశ్రాంతి అవసరమని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు పేర్కొంది. ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్లు గాయపడటంతో కెప్టెన్‌ ఎవరా అనే సందిగ్ధం నెలకొంది. ఈ తరుణంలో అనూహ్యంగా తాత్కలిక కెప్టెన్‌గా మర్‌క్రామ్‌ను ప్రకటించింది. డుప్లెసిస్‌ స్థానంలో ఫర్హాన్‌ బెహర్డీన్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. వన్డే సిరీస్‌ మొత్తానికి మర్‌ క్రామ్‌ నాయకత్వం వహించనున్నాడని క్రికెట్‌ దక్షిణాఫ్రికా కన్వీనర్‌ లిండాజొండి తెలిపారు. ఇది కష్టమైన నిర్ణయమేమి కాదని, మరక్రమ్‌కు డివిలియర్స్‌, ఇతర సీనియర్‌ ఆటగాళ్లు అండగా ఉంటారని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు