జులన్‌కు రూ. 50 వేలేనా?

8 Aug, 2017 00:16 IST|Sakshi

భారత మహిళా స్టార్‌ క్రికెటర్‌కు ఎయిరిండియా ‘చౌక’బారు ప్రోత్సాహం

కోల్‌కతా: గత కొన్నాళ్లుగా ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చౌక టికెట్లతో ప్రయాణికుల్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. బహుశా ఎయిరిండియా కూడా ఇదే ఫార్ములాను ప్రోత్సాహక సందర్భానికి వాడుకున్నట్లుంది. ఇటీవల జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో విశేషంగా రాణిం చిన భారత స్టార్‌ క్రికెటర్‌ జులన్‌ గోస్వామికి రూ. 50 వేల ప్రోత్సాహం, ప్రశంస పత్రంతో సరిపెట్టి చేతులు దులిపేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ సంస్థ నా కుటుంబంలాంటిది. నా కెరీర్‌ ఎదుగుదలకు వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఈ రోజు  నన్ను ఇలా గౌరవించడం చాలా ఆనందంగా ఉంది.

నాలాగే వివిధ క్రీడల్లో రాణిస్తున్న వారందరిని ఈ సంస్థ ఇలాగే ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’నని తెలిపి సంస్థ పరువు నిలిపే ప్రయత్నం చేసింది. ఇచ్చిన డబ్బు కన్నా సంస్థ గౌరవానికే ప్రాధాన్యమిచ్చిన జులన్‌ నిజంగా గ్రేట్‌! 2006 నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్న జులన్‌కు డిప్యూటీ మేనేజర్‌ నుంచి మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు. మరోవైపు ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్న రైల్వే క్రీడాకారిణులకు ఆ సంస్థ రూ. 13 లక్షల చొప్పున నగదు ఇవ్వడమే కాకుండా ప్రమోషన్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు