క్వార్టర్‌ ఫైనల్లో అజయ్‌ జయరామ్‌

7 Apr, 2017 00:43 IST|Sakshi
క్వార్టర్‌ ఫైనల్లో అజయ్‌ జయరామ్‌

మలేసియా ఓపెన్‌

కూచింగ్‌: భారత ఆటగాడు అజయ్‌ జయరామ్‌ మలేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో సంచలన విజయం సాధించాడు. నాలుగు రోజుల క్రితం ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ గెలిచి ఊపు మీదున్న విక్టర్‌ అక్సెల్సన్‌ను అతను కంగు తినిపించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో అన్‌ సీడెడ్‌ జయరామ్‌ 9–21, 21–14, 21–19తో నాలుగో సీడ్‌ అక్సెల్సన్‌ను ఓడించాడు. 44 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ సమరంలో భారత ఆటగాడు అసాధారణ పోరాటపటిమ కనబరిచాడు. తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ రెండో గేమ్‌లో పుంజుకోవడంతో 8–3తో ఆధిక్యంలోకి వచ్చాడు.

అయితే ప్రత్యర్థి కూడా దీటుగా బదులివ్వడంతో ఒక దశలో 12–12తో స్కోరు సమమైంది. అప్పుడు వరుసగా ఆరు పాయింట్లు సాధించి 18–12తో ప్రత్యర్థిని నిలువరించి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కూడా ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో 12–12, 18–18 వద్ద స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాత దూసుకెళ్లి 20–18 ఆధిక్యంలో నిలిచిన జయరామ్‌ మరో పాయింట్‌తో మ్యాచ్‌లో గెలుపొందాడు.

మరిన్ని వార్తలు