ప్రిక్వార్టర్స్‌లో అజయ్, సౌరభ్‌ వర్మ

4 Oct, 2018 01:40 IST|Sakshi

తైపీ సిటీ: భారత షట్లర్లు అజయ్‌ జయరామ్, సౌరభ్‌ వర్మలు చైనీస్‌ తైపీ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో అజయ్‌ జయరామ్‌ 18–21, 21–17, 21–9తో హషిరు షిమోన (జపాన్‌)పై, సౌరభ్‌ వర్మ 18–21, 21–16, 21–13తో లీ చీ హో (చైనీస్‌ తైపీ)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తెలంగాణ కుర్రాడు చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌ 11–21, 9–21తో లూ చి హంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, అభిషేక్‌ 5–21, 6–21తో ఐదో సీడ్‌ జాన్‌ ఒ జార్జెన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో పరాజయం చవిచూశారు.

మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు 15–21, 18–21తో చియాంగ్‌ ఇంగ్‌ లీ (చైనీస్‌ తైపీ) చేతిలో కంగుతినగా, హైదరాబాద్‌ అమ్మాయి శ్రీకృష్ణప్రియ 21–23, 20–22తో లిన్‌ యింగ్‌ చన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కిమ్‌ బ్రూన్‌ (డెన్మార్క్‌)తో అజయ్, రికి తకషిత (జపాన్‌)తో సౌరభ్‌ వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో తరుణ్‌ కోన–లిమ్‌ కిమ్‌ వా (మలేసియా) ద్వయం 13–21, 10–21తో నాలుగో సీడ్‌ ఒగ్‌ యి సిన్‌–టే యి (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది.  

మరిన్ని వార్తలు