కరాటేలో బ్లాక్‌బెల్ట్‌ సాధించా : రహానే

11 Apr, 2020 19:36 IST|Sakshi

ముంబై : క‌రోనా వైర‌స్ నేపథ్యంలో లాక్‌డౌన్ స‌మ‌యాన్ని టీమిండియా క్రికెట‌ర్లు రకరకాలుగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎప్పుడు వ‌రుస సిరీస్‌ల‌తో బిజీగా ఉండే క్రికెట‌ర్ల‌కు కుటుంబ‌స‌భ్యుల‌తో కలిసి గ‌డిపే అవ‌కాశం దొరికింది. కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ఇంట్లోనే ఉంటూ సరదాగా గడుపుతుండగా, ఇక ధోని విషయానికి వస్తే ఇంట్లోనే ఉంటూ గార్డెనర్‌గా అవతారమెత్తాడు. ఈ విష‌యంలో మిగ‌తా వారితో పోల్చుకుంటే టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానే మాత్రం కాస్త భిన్నంగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా ర‌హానే చేస్తున్న పనిని వీడియో రూపంలో తీసి బీసీసీఐ త‌మ అధికారిక  ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.
(ఆ చీకటి రోజుకు సరిగ్గా 20 ఏళ్లు)

'నా కూతురు ఆర్య నిద్ర లేవ‌క ముందే ఒక 30-45 నిమిషాల పాటు నేను వ‌ర్క్ ఔట్లు చేస్తాను. ఆ త‌ర్వాత కొద్దిసేపు క‌రాటే ప్రాక్టీస్‌లో నిమ‌గ్న‌మ‌వుతాను. క‌రాటేలో నాకు బ్లాక్‌బెల్ట్ కూడా ఉంది. ఒక‌సారి ఆర్య నిద్ర‌లేచిందంటే..అప్ప‌టి నుంచి నేను ఆమెతోనే గ‌డుపుతాను. ఆ స‌మ‌యంలో రాధిక ఇంటి ప‌నులు చూసుకుంటుంది. కూతురు నిద్ర‌పోతే...అప్పుడు మ్యూజిక్ విన‌డ‌మో లేక పుస్త‌కాలు చ‌దువుతాను. అప్పుడ‌ప్పుడు రాధిక నుంచి వంటకు సంబంధించిన చిట్కాలు  తెలుసుకుంటున్నాను. దీంతో రోజంతా తొంద‌ర‌గానే గ‌డిచిపోతుదంటూ' ర‌హానే వీడియోలో చెప్పుకొచ్చాడు. కాగా రహానే చివరిసారిగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ 2020 వాయిదా  పడిన సంగతి తెలిసిందే. కాగా రహానేను ఈసారి ఐపీఎల్‌ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు