కరోనాపై పోరుకు రహానే విరాళం 

30 Mar, 2020 00:40 IST|Sakshi

రూ. 10 లక్షలు కేటాయించిన భారత క్రికెటర్‌

ముందుకొచ్చిన పలువురు క్రీడాకారులు  

ముంబై: ‘కరోనా’ సృష్టించిన విపత్కర పరిస్థితులను దేశం సమర్థంగా ఎదుర్కొనేందుకు క్రీడా లోకం బాసటగా నిలుస్తోంది. భారత టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఆదివారం రూ. 10 లక్షలు విరాళమిచ్చాడు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ. 50 లక్షలు ఇవ్వనున్నట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌సంఘం (కేఎస్‌సీఏ) ప్రకటించింది. స్టార్‌ ప్లేయర్లకు దీటుగా వర్ధమాన క్రీడాకారులు తమ ఉదారతను చాటుకున్నారు. 16 ఏళ్ల భారత మహిళా క్రికెటర్‌ రిచా ఘోష్‌... బెంగాల్‌ ముఖ్యమంత్రి సహాయనిధి కోసం లక్ష రూపాయల విరాళమిచ్చింది. మరోవైపు హైదరాబాద్‌ టీనేజ్‌ షూటర్, 15 ఏళ్ల ఇషా సింగ్‌ ప్రధానమంత్రి సహాయ నిధికి తన సేవింగ్స్‌ నుంచి రూ. 30 వేలు విరాళంగా ఇచ్చింది. వీరితో పాటు రెండు సార్లు ఆసియా పారా గేమ్స్‌ హైజంప్‌ చాంపియన్‌ శరద్‌ పవార్‌ (రూ. 1 లక్ష), మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ ప్రతినిధి దీపక్‌ సింగ్‌ (రూ. 2 లక్షలు), మాజీ టెస్టు క్రికెటర్‌ మితు ముఖర్జీ (రూ. 25,000), బెంగాల్‌ మహిళల కోచ్‌ జయంత ఘోష్‌ (రూ. 10,000) విరాళం ఇచ్చారు.

మరిన్ని వార్తలు