పుజారాదే తప్పు: రహానే

11 Aug, 2018 15:37 IST|Sakshi
కోహ్లి, పుజారా

లార్డ్స్‌: ఇంగ్లండ్‌తో లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు సైతం రాణిస్తారని వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ఆశాభావం వ్యక్తం చేశాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లిసేన ఇంగ్లీష్‌ స్వింగ్‌కు తడబడి107 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆట అనంతరం రహానే మీడియాతో మాట్లాడుతూ.. 

‘పరిస్థితులు మొత్తం ఇంగ్లీష్‌ బౌలర్లకు అనుకూలించాయి. ముఖ్యంగా అండర్సన్‌, బ్రాడ్‌, వోక్స్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పిచ్‌పై పచ్చిక ఉండటంతో​ బంతి బాగా స్వింగ్‌ అయింది. దీంతో తొలి అర్ధబాగం బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టంగా మారింది. పుజారా రనౌట్‌ విషయంలో అతనిదే తప్పు. అతను రనౌట్‌ అయినప్పుడు చాలా బాధపడి ఉంటాడు. ఈ వికెట్‌ టీమిండియా బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది. మన తప్పులను ఎంత త్వరగా గుర్తిస్తే అంత బాగా రాణించగలము. అండర్సన్‌ సరైన ప్రదేశాల్లో బంతులు వేసాడు. అతని నుంచి ఒక్క తప్పిదం కూడా చేయలేదు. ఎవరూ వారికి వారు నిందించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మానసికంగా సిద్దమై పోరాడాల్సిందే. మా బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తారు. కుల్దీప్‌ రేపు నాలుగు వికెట్లతో చెలరేగుతాడని అనుకుంటున్నా. కెప్టెన్‌, కోచ్‌ అతనిపై నమ్మకం ఉంచారు. పిచ్‌ పేస్‌కు అనుకూలిస్తదన్న మాట వాస్తవమే. కానీ అతనో నాణ్యమైన బౌలర్‌ అనే విషయం మర్చిపోవద్దు’ అని రహానే చెప్పుకొచ్చాడు. 2014లో లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్ట్‌లో రహానే సెంచరీతో చెలరేగాడు.

వర్షం అంతరాయంతో తొలి రోజు ఆట నిలిచిపోగా.. రెండో రోజు ఆట సైతం వరణుడి అడ్డంకితోనే కొనసాగింది. ఇంగ్లండ్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ 5 వికెట్లతో చెలరేగడంతో భారత బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (29), కోహ్లి (23)లే టాప్‌ స్కోర్‌ కావడం విశేషం.

మరిన్ని వార్తలు