అఫ్గానే కదా అని తేలికగా తీసుకోం: రహానే

29 May, 2018 20:41 IST|Sakshi
అజింక్యా రహానే (ఫైల్‌ ఫొటో)

ముంబై : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక టెస్టును తేలికగా తీసుకోబోమని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్యా రహానే అభిప్రాయపడ్డాడు. మంగళవారం ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రహానే మాట్లాడుతూ.. ‘ప్రతి టెస్టుకు ఒకే ప్రాధాన్యత ఇస్తాం, అఫ్గాన్‌కు టెస్టు హోదా లభించడం మంచి విషయం. ప్రత్యర్థి ఎవరైనా మైదానంలో దిగామంటే మా ఆలోచనా విధానం ఓకేలా ఉంటుంది. మా బలాలపై దృష్టిసారించడమే మాకు ముఖ్యం. అఫ్గాన్‌ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లున్నారు. వారంతా లిమిటెడ్‌ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. టెస్టులకు కొత్త కదా అని తేలికగా తీసుకోం. మైదానంలో అడుగుపెట్టామంటే బ్రాండ్‌ క్రికెట్‌ ఆడటానికే ప్రయత్నిస్తాం’ అని రహానే తెలిపాడు.

రషీద్‌, ముజీబ్‌లపై స్పందిస్తూ.. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారని, ఎరుపు బంతికి కొత్త కావచ్చు కానీ నాణ్యమైన స్పిన్నర్లని అభిప్రాయపడ్డాడు. అలాగని పేస్‌ బౌలర్లను తక్కువ అంచనా వేయలేమన్నాడు. ఇక తన భవిష్యత్‌ క్రికెట్‌ పట్ల సానుకూలా దృక్పథంతో ఉ‍న్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు సారథ్యం వహించడం తనకు మరింత ధైర్యాన్నిచ్చిందని చెప్పుకొచ్చాడు. మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌ అవకాశలపై మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్‌ టోర్నీలో ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని ప్రతి ఒక్కరు ఆశయంగా పెట్టుకుంటారు. ఇంకో ఏడాది సమయం ఉంది. వన్డే జట్టులోకి తిరిగి రావడం నాకెంతో అవసరం’ అని పేర్కొన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో కెప్టెన్‌ కోహ్లి గాయంతో సిరీస్‌ నిర్ణయాత్మక ధర్మశాల టెస్టుకు దూరమయ్యాడు. దీంతో రహానేకు తొలి సారి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించిన రహానే భారత్‌కు విజయాన్నందించాడు. తాజా అఫ్గాన్‌ టెస్టుకు కోహ్లికి విశ్రాంతి కల్పించడంతో రహానేకు మరోసారి కెప్టెన్సీ అవకాశం వచ్చింది. జూలై 14న ఈ చారిత్రాత్మక టెస్ట్‌ ప్రారంభం కానుంది.

చదవండి: భారత్‌ను ఢీకొట్టే అఫ్గాన్‌ జట్టు ఇదే

మరిన్ని వార్తలు