న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజిత్ చండిలా, మాజీ క్రికెటర్ బాబురావు యాదవ్, బుకీ దీపక్ కుమార్కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ ముగ్గురి బెయిల్ పిటిషన్లను సోమవారం ఢిల్లీ కోర్టు ఆడిషినల్ జడ్డి ధర్మేష్ శర్మ విచారించారు.
ఈ కేసు పురోగతిలో కొన్ని లింక్లు మిస్సయ్యాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన న్యాయమూర్తి బెయిల్ను మంజూరు చేశారు. నిందితులు రూ. 50వేల వ్యక్తిగత బాండ్లు సమర్పించడంతో పాటు అంతే మొత్తానికి పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బుకీలు జితేందర్ కుమార్ జైన్, రమేశ్ వ్యాస్, అశ్విన్, సునిల్, అన్సారీ బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. వీరిపై ‘మోకా’ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.