ఆకాశ్‌దీప్‌కు రూ.55 లక్షలు

19 Sep, 2015 02:52 IST|Sakshi
ఆకాశ్‌దీప్‌కు రూ.55 లక్షలు

సర్దార్ సింగ్‌కు నిరాశ
హాకీ ఇండియా లీగ్ ఆటగాళ్ల వేలం
 

 న్యూఢిల్లీ : హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) ఆటగాళ్ల వేలంలో యువ స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్‌కు భారీ ధర పలికింది. అయితే భారత హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్‌పై ఫ్రాంచైజీలు అంతగా ఆసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యపరిచింది. వచ్చే సీజన్ కోసం శుక్రవారం జరిగిన ఈ వేలంలో ఆకాశ్‌దీప్‌ను ఉత్తర ప్రదేశ్ విజార్డ్స్ 84 వేల డాలర్ల (రూ.55,56,247)కు కొనుగోలు చేసింది. భారత ఆటగాళ్లలో అత్యధిక మొత్తం ఆకాశ్‌కే దక్కింది. ఆ తర్వాత స్థానంలో 81 వేల డాలర్ల(రూ.53,57,578) ధరతో సీనియర్ డ్రాగ్‌ఫ్లికర్ సందీప్ సింగ్ (రాంచీ రేస్), గుర్మైల్ సింగ్ (దబాంగ్ ముంబై) నిలిచారు.

మరోవైపు ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఈ ఏడాది వదులుకున్న సర్దార్ సింగ్‌ను 58 వేల డాలర్ల (రూ. 38,36,290) తక్కువ మొత్తంతో పంజాబ్ వారి యర్స్ తీసుకుంది. ఓవరాల్‌గా జర్మనీ స్టార్ ఆటగాడు మోరిట్జ్ ఫ్యుయర్‌స్టే టాప్‌లో నిలిచాడు. కళింగ లాన్సర్స్ ఈ ఆటగాడిని లక్షా 5 వేల డాలర్ల (రూ.69,46,289)కు తీసుకుంది.

మరిన్ని వార్తలు