కరాచీ: పాకిస్తాన్ క్రికెట్లో తరచు వార్తల్లో ఉండే మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. అటు పాకిస్తాన్ క్రికెటర్లపై విరుచుకుపడినా, ఇటు విదేశీ క్రికెటర్లను ప్రశంసల్లో ముంచెత్తినా అక్తర్ స్టైలే వేరు. ప్రపంచ క్రికెట్లో ప్రతీ అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ తనదైన మార్కును సంపాదించుకున్నాడు. తన క్రికెట్ కెరీర్లో ప్రత్యర్థి క్రికెటర్లను పేస్ బౌలింగ్ హడలెత్తించిన అక్తర్.. ఇప్పుడు క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఆధునిక క్రికెట్లో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టమంటే అది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే అంటున్నాడు. ఈ తరం క్రికెట్లో కోహ్లికి బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదన్నాడు.
అవకాశం దొరికినప్పుడల్లా కోహ్లిని ఆకాశనాకెత్తేసే అక్తర్..తాజాగా అతని బౌలింగ్ చేయాలంటే ఆలోచించాల్సిందేనన్నాడు. ఫ్యాన్స్తో ప్రశ్నలు-సమాధానాలు సెషన్లో పాల్గొన్న అక్తర్కు ఒక ప్రశ్న ఎదురైంది. ‘ఈ ఆధునిక క్రికెట్ ఎవరికి బౌలింగ్ చేయడం కష్టం’ అని ఒక అభిమాని అడిగాడు. దానికి ఎటువంటి తడబాటు లేకుండా కోహ్లి అంటూ సమాధానమిచ్చాడు. కోహ్లి ఒక కఠినతరమైన బ్యాట్స్మన్ అని అక్తర్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను గెలిచిన టీమిండియా ఇప్పుడు టెస్టు సిరీస్పై కన్నేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించి రెండో టెస్టుకు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోంది. శుక్రవారం ఈడెన్ గార్డెన్లో ఇరు జట్ల మధ్య డే అండ్ నైట్ ఆరంభం కానుంది.