సీఓఏకు ఈశాన్య రాష్ట్రాల వినతి
న్యూఢిల్లీ: ఈశాన్య భారతానికి చెందిన ఆరు రాష్ట్రాల క్రికెట్ జట్లు ఒక్కటిగా ఏర్పడి రంజీ ట్రోఫీలో ఆడాలని భావిస్తున్నాయి. ఈమేరకు అనుమతి ఇవ్వాలంటూ పరిపాలక కమిటీ (సీఓఏ)కి విజ్ఞప్తి చేయనున్నాయి. ఇదే విషయమై ఈనెల 8న మేఘాలయ, మణిపూర్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం ప్రతినిధులు సీఓఏతో సమావేశమవుతారని ఎన్ఈ రాష్ట్ర క్రికెట్ సంఘం కన్వీనర్ నబా భట్టాచార్య తెలిపారు.
లోధా ప్యానెల్ సంస్కరణలను అనుసరిస్తూ తమకు కూడా బీసీసీఐలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని ఈ సంఘాలు గతం నుంచీ కోరుతున్నాయి. అస్సాం, త్రిపుర జట్లు రంజీ ట్రోఫీలో పాల్గొంటుండగా, బీసీసీఐలోనూ ఓటింగ్ హక్కు కలిగి ఉన్నాయి. అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీ, కుచ్ బెహర్ ట్రోఫీ (అండర్–19)లో ఇప్పటికే ఉమ్మడి ఎన్ఈ జట్టుగా ఆడామని ఆయన గుర్తుచేశారు.