‘మేం గెల్చినప్పుడు ఇది మామూలే’

23 May, 2018 12:13 IST|Sakshi
చెన్నై కెప్టెన్‌ ధోని

ముంబై : డుప్లెసిస్‌ చివరి ఓవర్లో మొదటి బాల్‌కు సిక్స్‌ బాది తన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చారు. ఓపెనర్‌గా వచ్చిన అతను చివరి వరకు పోరాట పటిమను ప్రదర్శించి అద్భుతమైన బ్యాటింగ్‌తో సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించారు. వాంఖడే స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్‌-1లో భావోద్వేగాలు పొంగిపొర్లాయంటే అతిశయోక్తి కాదు.

2013 ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ అనంతరం, సీఎస్‌కే జట్టులోని సభ్యులు గుజరాత్‌ లయన్స్‌కు, పుణె సూపర్‌ జెయింట్స్‌కు వెళ్లారు. రెండేళ్ల విరామం అనంతరం తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. తిరిగి చెన్నైలోకి వచ్చిన ఏడాదే ఫైనల్‌కు చేరడంతో వారు సంబరాల్లో మునిగిపోయారు. క్వాలిఫైయర్‌-1ను తిలకించేందుకు క్రీడాకారుల భార్యలందరూ వచ్చారు.

ఐపీఎల్‌లో సీఎస్‌కే ఫైనల్‌కు చేరడం ఇది ఏడోసారి. ధోనికి ఇది ఎనిమిదో ఫైనల్‌ మ్యాచ్( గతేడాది పుణే‌ జట్టు ఐపీఎల్‌ ఫైనల్‌ చేరుకుంది). మ్యాచ్‌ విజయానంతరం ఆటగాళ్లందరూ కలిసి స్టేడియంలోకి పరుగెత్తుకొచ్చి డుప్లెసిస్‌ను, శార్ధూల్‌ ఠాకూర్‌ను హత్తుకొని తమ ఆనందాన్ని, ప్రేమాభిమానాలను చాటుకున్నారు. స్టేడియంలోని సీఎస్‌కే అభిమానుల ఆనందాన్ని మాత్రం మాటల్లో వర్ణించలేనిది.

విజయానంతరం మాట్లాడిన ధోని.. మేం గెల్చినప్పుడు ఆనందంగా ఉండటం అనేది మామూలు విషయమేనని అన్నారు. తొలి రెండు స్థానాల్లో నిలవడం అనేది మరో అవకాశాన్ని ఇస్తుంది. ఒకవేళ మేం ఓడినా మరో అవకాశం ఉండేదని ధోని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు