నేను ఉన్నది తబలా వాయించడానికా?: రవిశాస్త్రి

26 Sep, 2019 12:34 IST|Sakshi

బెంగళూరు:  టీమిండియా యువ వికెట్‌  కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఆట తీరుపై  తీవ్ర స్థాయిలో విమర్శల వస్తున్న నేపథ్యంలో ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి  కాస్త ఘాటుగా స్పందించాడు. తాను ఇక్కడ ఊరికేలేనని, ఆటగాళ్లను మెరుగుపరచడం కోసమే ఉన్నానంటూ విమర్శలను తిప్పికొట్టాడు. తాను భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ బాధ్యతలు తీసుకున్నది తబలా వాయించడానికా అంటూ తనదైన శైలిలో ప్రశ్నించాడు. ‘ఇటీవల రిషభ్‌ పంత్‌ కొన్ని తప్పుడు షాట్ల కారణంగా వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. అంతమాత్రాన జట్టు నుంచి తప్పించలేము కదా. కాస్త ఓపిక పట్టి చూద్దాం. అతనొక వరల్డ్‌క్లాస్‌ ఆటగాడు. మ్యాచ్‌ను ఒంటి చేత్తో  గెలిపించే సత్తా పంత్‌లో ఉంది. మనం సంయమనంతో ఉంటే అతని అత్యుత్తమం బయటకొస్తుంది.  మనం ఒక ఉత్తమ ఆటగాడిగా అండగా నిలవాలి. ఆటగాళ్లు ఒకే తరహా తప్పులు చేస్తూ పెవిలియన్‌ బాట పడితే వాటిని చక్కదిద్దడానికే నేను ఇక్కడ ఉన్నా.

అంతే కాని తబలా వాయించడానికి ఇక్కడ లేను. ప్రస్తుత భారత్‌ క్రికెట్‌ పంత్‌ ఒక ఆయుధమని మీడియా రాస్తుంది. నిపుణులు వారి పనిని వారు సమర్ధంగా నిర్వహిస్తున్నారు. వారు మాట్లాడతారు ఎవరు  ఏమిటో. పంత్‌ ఒక ప్రత్యేకమైన కుర్రాడు. ఇంకా నేర్చుకుంటూనే ముందుకు సాగుతున్నాడు. టీమిండియా మేనేజ్‌మెంట్‌ అతనికి అండగా ఉంది. అతను కచ్చితంగా గాడిలో పడతాడు’ అని విమర్శకులకు రవిశాస్త్రి బదులిచ్చాడు. ఇటీవల రిషభ్‌ పంత్‌కు రవిశాస్త్రి అండ్‌ కంపెనీ అండగా నిలుస్తుందంటూ గౌతం గంభీర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రిషభ్‌ పంత్‌ అవసరం ఇంకా ఏముందంటూ గంభీర్‌ ప్రశ్నించాడు. ప్రధానంగా రవిశాస్త్రి, కోహ్లిలనే గంభీర్‌ టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశాడు. ఈ ఇద్దరి అండతోనే పంత్‌ జట్టులో కొనసాగుతున్నాడంటూ ధ్వజమెత్తాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రవిశాస్త్రి కాస్త ఘాటుగా బదులిచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు