ముంబై: రియో పారాలింపిక్స్ లో రజత పతకం సాధించిన షాట్పుట్ క్రీడాకారిణి దీపా మలిక్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినిమా ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఆమె అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్ లో రజత పతకం గెలిచి భారత దేశానికి దీపా మలిక్ గర్వకారణంగా నిలిచిందని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. రియోలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించిందని వ్యాఖ్యానించారు.
పారాలింపిక్స్ లో దీపా మలిక్ చరిత్ర సృష్టించిందని సీనియర్ నటి హేమమాలిని ప్రశంసించారు. ఆమెను చూసి దేశం గర్విస్తోందన్నారు. మహిళల షాట్పుట్ (ఎఫ్-53) ఈవెంట్లో దీపా మలిక్ మన దేశానికి రజత పతకం సాధించడం సంతోషం కలిగిస్తోందని హీరో ఇమ్రాన్ హష్మీ పేర్కొన్నాడు. దీపా మలిక్ విజయం స్ఫూర్తిదాయకమని టాలీవుడ్ హీరో మంచు విష్ణు ట్వీట్ చేశాడు.