హారిక 14... హంపి 19

30 Dec, 2018 02:08 IST|Sakshi

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు నిరాశ పరిచారు. ఓపెన్‌ విభాగంలో భారత్‌ తరఫున విశ్వనాథన్‌ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విష్ణు ప్రసన్న, నిహాల్‌ సరీన్‌... మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి బరిలోకి దిగారు. ఓపెన్‌ విభాగంలో 15 రౌండ్లు జరిగాయి. 9.5 పాయింట్లు సాధించిన ఆనంద్‌ 23వ ర్యాంక్‌తో సరిపెట్టుకోగా... 7.5 పాయింట్లతో హరికృష్ణ 93వ ర్యాంక్‌లో, విష్ణు ప్రసన్న 111వ ర్యాంక్‌లో, 7 పాయింట్లతో నిహాల్‌ సరీన్‌ 130వ ర్యాంక్‌లో నిలిచారు. 11.5 పాయింట్లు సాధించిన రష్యా గ్రాండ్‌మాస్టర్‌ డానిల్‌ దుబోవ్‌ విజేతగా అవతరించాడు. 10.5 పాయింట్లు సంపాదించిన షఖిర్యార్‌ మమెదైరోవ్‌ (అజర్‌బైజాన్‌), హికారు నకముర (అమెరికా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ హారిక 8 పాయింట్లతో 14వ స్థానంతో... హంపి 7.5 పాయింట్లతో 19వ స్థానంతో సంతృప్తి పడ్డారు. 10 పాయింట్లతో జు వెన్‌జున్‌ (చైనా) టైటిల్‌ను సొంతం చేసుకుంది. హారిక ఆరు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. హంపి ఐదు గేముల్లో నెగ్గి, మరో ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా రెండు గేముల్లో ఓటమి పాలైంది. శనివారం మొదలైన బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌లో తొమ్మిది రౌండ్‌లు ముగిశాక హారిక 6.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... 6 పాయింట్లతో హంపి 16వ స్థానంలో కొనసాగుతున్నారు. నేడు మిగతా ఎనిమిది రౌండ్‌లు జరుగుతాయి. 

మరిన్ని వార్తలు