బరోడాను కట్టడి చేసిన ఆంధ్ర

15 Oct, 2017 01:17 IST|Sakshi

రాణించిన అయ్యప్ప రంజీ ట్రోఫీ  

వడోదర: తొలి మ్యాచ్‌లో పటిష్టమైన తమిళనాడును దాదాపు ఓడించినంత పనిచేసిన ఆంధ్ర జట్టు రెండో మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. రంజీ ట్రోఫీలో భాగంగా గ్రూప్‌ ‘సి’లో మాజీ చాంపియన్‌ బరోడాతో శనివారం మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్లు రాణించారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి బరోడా జట్టు 90 ఓవర్లలో 7 వికెట్లకు 247 పరుగులు చేసింది. పేస్‌ బౌలర్‌ బండారు అయ్యప్ప 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... కార్తీక్‌ రామన్‌కు రెండు వికెట్లు దక్కాయి. విజయ్‌ కుమార్, భార్గవ్‌ భట్‌ ఒక్కో వికెట్‌ తీశారు. భారత జట్టు మాజీ సభ్యులు యూసుఫ్‌ పఠాన్‌ (1), ఇర్ఫాన్‌ పఠాన్‌ (0) విఫలమయ్యారు. ఓపెనర్‌ కేదార్‌ దేవ్‌ధర్‌ (93; 11 ఫోర్లు) త్రుటిలో సెంచరీని కోల్పోగా... విష్ణు సోలంకి (61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం స్వప్నిల్‌ సింగ్‌ (30 బ్యాటింగ్‌), అతీత్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.  

హైదరాబాద్, యూపీతొలి రోజు ఆట రద్దు
మరోవైపు సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో హైదరాబాద్, ఉత్తరప్రదేశ్‌ (యూపీ) జట్ల మధ్య గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో తొలి రోజు ఆట రద్దయింది. రాత్రి కురిసిన వర్షం కారణంగా మైదానం అవుట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు.

>
మరిన్ని వార్తలు