కర్ణాటక చేతిలో ఆంధ్ర ఓటమి

2 Apr, 2014 01:39 IST|Sakshi

సాక్షి, విజయనగరం: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సౌత్‌జోన్ ట్వంటీ20 టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టుకు కర్ణాటక చేతిలో పరాజయం ఎదురైంది. ఇక్కడి పీవీజీ రాజు-ఏసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టు 7 వికెట్ల తేడాతో ఆంధ్రపై గెలుపొందింది. తొలుత ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 131 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (34 బంతుల్లో 53 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు. ప్రశాంత్ (29), చిరంజీవి (20) ఫర్వాలేదనిపించారు.
 
 కర్ణాటక బౌలర్లలో అబ్రార్ కజి 2 వికెట్లు తీయగా, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, శరత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మనీశ్ పాండే (51 బంతుల్లో 60, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), లోకేశ్ రాహుల్ (34 బంతుల్లో 41, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో సుధాకర్ రెండు వికెట్లు, ప్రవీణ్ ఒక వికెట్ తీశారు.
 

మరిన్ని వార్తలు