ఆంధ్ర అదరహో

30 Jan, 2020 02:02 IST|Sakshi

కేరళపై ఏడు వికెట్లతో ఘన విజయం

సాక్షి, ఒంగోలు: ఈ సీజన్‌లో మరోసారి ఆంధ్ర రంజీ క్రికెట్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. కేరళతో మూడు రోజుల్లోనే ముగిసిన రంజీ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఆంధ్ర నాలుగు విజయాలు సాధించి, రెండింటిని ‘డ్రా’గా ముగించింది. 18 జట్లున్న ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి’ గ్రూప్‌లో ప్రస్తుతం ఆంధ్ర 27 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93 పరుగులతో వెనుకబడి ఆట మూడో రోజు బుధవారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కేరళ జట్టును ఆంధ్ర పేస్‌ బౌలర్లు మొహమ్మద్‌ రఫీ, యెర్రా పృథ్విరాజ్, శశికాంత్‌ హడలెత్తించారు.

ఫలితంగా కేరళ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన రఫీ రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులిచ్చి 3 వికెట్లు... పృథీ్వరాజ్‌ 26 పరుగులిచ్చి 3 వికెట్లు, శశికాంత్‌ 47 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి కేరళ పతనాన్ని శాసించారు. అనంతరం 43 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర జట్టు 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హైదరా బాద్‌లో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ చేతిలో హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు