ఆంధ్రకు మూడో గెలుపు 

9 Dec, 2018 00:30 IST|Sakshi

 రాణించిన అనూష, స్నేహ, జ్యోతి  

సాక్షి, గుంటూరు వెస్ట్‌: బ్యాటింగ్‌లో అనూష, స్నేహ... బౌలింగ్‌లో జ్యోతి (2/23) అద్భుత ప్రతిభ కారణంగా బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు మూడో విజయం సాధించింది. హరియాణాతో శనివారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్‌ అనూష (72; 5 ఫోర్లు) రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగ్గా... స్నేహ (34 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు), సీహెచ్‌ ఝాన్సీ లక్ష్మి (42 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హరియాణా 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 213 పరుగులు చేసి ఓడిపోయింది.

ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ వేసిన జ్యోతి చివరి మూడు బంతులకు ఒక్క పరుగు ఇవ్వకుండా క్రీజులో నిలదొక్కుకున్న సోనియా (44 బంతుల్లో 35; 3 ఫోర్లు), శీతల్‌ (67 బంతుల్లో 59; 7 ఫోర్లు) లను ఔట్‌ చేసి ఆంధ్ర విజయాన్ని ఖాయం చేయడం విశేషం. హరియాణా 136 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో సోనియా, శీతల్‌ నాలుగో వికెట్‌కు 77 పరుగులు జతచేసి తమ జట్టును లక్ష్యం సమీపానికి తెచ్చారు. అయితే జ్యోతి అద్భుత బౌలింగ్‌తో హరియాణా లక్ష్యానికి చేరువై దూరమైపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో మహారాష్ట్ర ఏడు వికెట్లతో సౌరాష్ట్రపై; విదర్భ 77 పరుగులతో గోవాపై గెలిచాయి.  

>
మరిన్ని వార్తలు