ఆంధ్ర యూనివర్సిటీ జట్టుకు స్వర్ణం

27 Feb, 2020 05:28 IST|Sakshi

కటక్‌: ఖేలో ఇండియా అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడల్లో భాగంగా పురుషుల బ్యాడ్మింటన్‌ టీమ్‌ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్, గారగ కృష్ణప్రసాద్, ప్రణయ్‌ రెడ్డి, కలగ జగదీశ్, ఆకాశ్‌ చంద్రన్, ఆదిత్య గోపరాజు బాపినీడు, గూడె సుదీశ్‌ వెంకట్‌లతో కూడిన ఆంధ్ర యూనివర్సిటీ జట్టు 3–1తో పంజాబ్‌ యూనివర్సిటీ (చండీగఢ్‌) జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్‌ రెడ్డి (ఆంధ్ర) 6–21, 7–21తో కార్తీక్‌ జిందాల్‌ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో జగదీశ్‌ 21–16, 21–19తో అభిషేక్‌ సైనిపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో శ్రీకృష్ణ సాయికుమార్‌–కృష్ణప్రసాద్‌ జంట 12–21, 21–18, 21–15తో కార్తీక్‌ జిందాల్‌–హార్దిక్‌ జోడీపై గెలవడంతో ఆంధ్ర యూనివర్సిటీ ఆధిక్యం 2–1కి చేరింది. నాలుగో మ్యాచ్‌లో ఆదిత్య 21–14, 21–17తో హార్దిక్‌ మక్కర్‌ను ఓడించడంతో ఆంధ్ర యూనివర్సిటీ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు