టైటిల్‌పోరుకు అనిరుధ్‌ జోడీ

29 Sep, 2019 10:15 IST|Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల టోర్నమెంట్‌లో తెలంగాణకు చెందిన అనిరుధ్‌ చంద్రశేఖర్‌ నిలకడగా రాణిస్తున్నాడు. చైనాలో జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌తో కలిసి అనిరుధ్‌ డబుల్స్‌ విభాగంలో టైటిల్‌పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ అనిరుధ్‌–విజయ్‌ సుందర్‌ (భారత్‌) ద్వయం 6–0, 6–4తో చుకాంగ్‌ వాంగ్‌–జిహావో షియా (చైనా) జోడీపై గెలుపొందింది. అంతకుముందు క్వార్టర్స్‌లో 6–1, 6–3తో చెంగ్‌ హాన్‌–చాంగ్‌ జాంగ్‌ (చైనా) జోడీపై నెగ్గారు.

మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో విఘ్నేశ్‌ పెరణమల్లూర్‌–చెరుకు వశిష్ట్‌ (భారత్‌) జంట 6–3, 4–6, 5–10తో చుకాంగ్‌ వాంగ్‌–జిహావో షియా (చైనా) జోడీ చేతిలో ఓడింది. సింగిల్స్‌ విభాగంలో అనిరుధ్‌ పోరాటం ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అనిరుధ్‌ (భారత్‌) 7–5, 0–6, 0–6తో నాలుగో సీడ్‌ టకాషి సయాటో (జపాన్‌) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో అనిరుధ్‌ 6–4, 6–1తో జియాన్‌ యావో హో (చైనా)పై గెలుపొందాడు.  

మరిన్ని వార్తలు