ఫైనల్లో అనిరుధ్‌ జంట

5 Jan, 2019 10:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల టోర్నీలో తెలంగాణ క్రీడాకారుడు అనిరుధ్‌ చంద్రశేఖర్‌ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. చైనాలోని ఆనింగ్‌ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్‌ కేటగిరీలో అనిరుధ్‌ తన భాగస్వామి ఎన్‌. విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌తో కలిసి ఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అనిరుధ్‌–విజయ్‌ సుందర్‌ (భారత్‌) ద్వయం 4–6, 7–5, 10–8తో సొరా ఫుకుడా–తైసీ ఇచికవా (జపాన్‌) జంటపై గెలుపొందింది.

అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో భారత జోడీ 7–6 (7/5), 6–4తో జియు చె– వికియాంగ్‌ జెంగ్‌ (చైనా) జంటను ఓడించింది. మరోవైపు సింగిల్స్‌ విభాగంలో అనిరుధ్‌ తొలిరౌండ్‌లోనే ఓడిపోగా... విజయ్‌ సుందర్‌ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో అనిరుధ్‌ 6–4, 1–6, 4–6తో టాప్‌ సీడ్‌ టి చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, ప్రిక్వార్టర్స్‌లో విజయ్‌ సుందర్‌ 5–7, 2–6తో హావో వు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. 

మరిన్ని వార్తలు