క్వార్టర్స్‌లో అనిరుధ్‌–విఘ్నేశ్‌ జంట

14 Mar, 2017 11:16 IST|Sakshi
క్వార్టర్స్‌లో అనిరుధ్‌–విఘ్నేశ్‌ జంట

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌  


బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ఆటగాళ్లు ముందంజ వేశారు. డబుల్స్‌ విభాగంలో అనిరుధ్‌ బ్రదర్స్‌ జోడీ, విష్ణువర్ధన్‌ జోడీ క్వార్టర్స్‌కు చేరుకోగా... సింగిల్స్‌ విభాగంలో రిషబ్‌ అగర్వాల్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు.

 

కర్ణాటక స్టేట్‌ లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో అనిరుధ్‌ చంద్రశేఖర్‌– విఘ్నేశ్‌ ద్వయం 6–4, 0–6, 10–7తో అన్విత్‌ బెంద్రె–మోహిత్‌ మయూర్‌ జయప్రకాశ్‌ (భారత్‌) జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ జంట 6–1, 6–3తో నిక్షేప్‌ రవికుమార్‌– సూరజ్‌ ప్రబోధ్‌ జోడీని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో తేజస్‌ చౌకుల్కర్‌–నికి కలియండ పూనచ (భారత్‌) జంట 6–4, 7–6 (5)తో విజయంత్‌ మలిక్‌–సిద్ధార్థ్‌ రావత్‌ జోడీపై, వశిష్ట్‌ చెరుకు–ప్రజ్వల్‌ దేవ్‌ (భారత్‌) జంట 7–6 (4), 6–3తో అర్జున్‌ మరియప్ప–దక్షిణేశ్వర్‌ సురేశ్‌ జోడీపై గెలుపొందాయి.

రిషబ్‌ ముందంజ


మరోవైపు పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రిషబ్‌ అగర్వాల్‌ 6–0, 6–3తో ఆదిత్య హరి ససోంగ్‌కో (ఇండోనేసియా)పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో మోహిత్‌ మయూర్‌ జయప్రకాశ్‌ 3–6, 6–4, 6–4తో నికి కలియండ పూనచపై, విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ 6–4, 7–5తో జతిన్‌ దహియాపై, సిద్ధార్థ్‌ రావత్‌ 6–3, 7–5తో అభినవ్‌ సంజీవ్‌ షణ్ముగమ్‌పై, శశికుమార్‌ ముకుంద్‌ 6–3, 6–1తో జేసన్‌ పాట్రోంబోన్‌ (ఫిలిప్పీన్స్‌)పై గెలుపొంది తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.    

 

>
మరిన్ని వార్తలు