‘సారీ.. పాక్‌ పర్యటనకు వెళ్లలేను’

29 Sep, 2019 12:28 IST|Sakshi

ఢాకా:  తాను పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లలేనని బంగ్లాదేశ్‌ మహిళా క్రికెట​ జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న భారత మాజీ క్రీడాకారిణి అంజు జైన్‌ తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్‌ పర్యటనకు వెళ్లే బంగ్లాదేశ్‌ జట్టుతో తాను వెళ్లలేనని బోర్డుకు తెలిపారు. అంజు జైన్‌తో మరో ఇద్దరు కూడా పాక్‌ పర్యటనకు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు డైలమాలో పడింది. పాక్‌ పర్యటనలో రెండు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సిన తరుణంలో అంజు జైన్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు. దాంతో తాత్కాలిక కోచ్‌ను ఎంపిక చేసి పాక్‌ పర్యటనకు పంపాలనే యోచనలో బీసీబీ ఉంది.

దీనిపై బంగ్లాదేశ్‌ టీమ్‌ మేనేజర్‌ జావేద్‌ ఓమర్‌ మాట్లాడుతూ.. భారత్‌ కోచ్‌లు పాక్‌ పర్యటనకు పంపడం అనేది మా చేతుల్లో లేదు. ఇది చాలా సున్నితమైన అంశం’ అని పేర్కొన్నారు.  పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్‌ పర్యటించడంపై బీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నజాముద్దీన్‌ చౌధురి మాట్లాడుతూ.. భద్రతా పరమైన హామీ లభించిన తర్వాత పాక్‌ పర్యటనకు మొగ్గుచూపినట్లు పేర్కొన్నారు. ‘మేము పీసీబీతో టచ్‌లో ఉన్నాం. అక‍్కడ మాకు ఏ విధమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు అనే దానిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం శ్రీలంక జట్టు పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న విషయాన్ని కూడా గమనిస్తున్నాం. పాక్‌లో పరిస్థితిపై ఐసీసీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది’ అని నజాముద్దీన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు