తెలుగు టైటాన్స్‌కు మరో ఓటమి  

8 Dec, 2018 01:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ పరాజయాల బాట వీడటం లేదు. ట్యాక్లింగ్‌తో పాటు రైడింగ్‌లో విఫలమైన టైటాన్స్‌ సొంత ప్రేక్షకుల మధ్య కూడా సత్తా చాటలేక వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. నగరంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన హోరాహోరీ పోరులో తెలుగు టైటాన్స్‌ 27–29తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 12–17తో వెనుకంజలో ఉన్న టైటాన్స్‌ ఆ తర్వాత పుంజుకొని వరుస పాయింట్లు సాధించింది.

ఓ దశలో 26–23తో ఆధిక్యంలోకి వచ్చింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా... అనూహ్యంగా తడబడి ఓటమి మూటగట్టుకుంది. కీలక సమయంలో స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి ఔట్‌ కావడం ఫలితంపై ప్రభావం చూపింది. గుజరాత్‌ తరఫున ప్రపంజన్‌ 10 పాయింట్లతో మెరవగా... టైటాన్స్‌ తరఫున రాహుల్‌ చౌదరి 8 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ 53–36తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో యు ముంబాతో బెంగాల్‌ వారియర్స్, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్‌ తలపడనున్నాయి.   

మరిన్ని వార్తలు