భారత క్రికెటర్లు ఫుల్‌ జోష్‌గా..

19 Jun, 2019 23:29 IST|Sakshi

లండన్‌:  ప్రపంచకప్‌లో అజేయంగా సాగుతున్న భారత క్రికెట్‌ జట్టు కాస్త సేదతీరాలని నిర్ణయించుకుంది. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు సరదాగా గడుపుతున్నారు. బీసీసీఐ అనుమతించడంతో సారథి విరాట్‌ కోహ్లితో సహా కొందరు ఆటగాళ్లు తమ భార్యా పిల్లలతో కలిసి సందడి చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన తర్వాత భారత జట్టుకు ఐదు రోజులపాటు విరామం దొరికింది. దీంతో రెండు రోజులు ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్‌ రద్దు చేసి విశ్రాంతినిచ్చారు. అలాగే ఆటగాళ్లతో 15 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఉండేందుకు తాజాగా బీసీసీఐ సమ్మతించింది.
దీంతో బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీని కలిసేందుకు లండన్‌ వెళ్లారు. ఇద్దరూ కలిసి లండన్ లోని ఓల్డ్ బాండ్ స్ట్రీట్ లో డిన్నర్ చేస్తుండగా అభిమానులు గుర్తించి క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అటు కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన భార్య రితికతో కలిసి షాపింగ్ చేస్తూ కనిపించాడు. అలాగే శిఖర్ ధావన్ సైతం గాయం కారణంగా టీమిండియాకు దూరమైన నేపథ్యంలో భార్యతో కలిసి లండన్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. మరోవైపు ధోనీ సైతం తన కూతురు, భార్యతో కలిసి లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. కాగా, పెళ్లైన సీనియర్లు భార్యా, పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే, బ్యాచిలర్ బాబులు మాత్రం ఒంటరిగా నెట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. (చదవండినేను వెళ్తున్నా.. ధావన్‌ భావోద్వేగం)

ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటివరకు టీమిండియా నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలవగా ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం కోహ్లిసేన ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు అఫ్గాన్‌ జట్టు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 150 పరుగుల తేడాతో ఘరో పరాభవం చెందగా భారత్‌ 89 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ జూన్‌ 22న(శనివారం) అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.

>
మరిన్ని వార్తలు