మీ అందరికీ నేనే దొరికానా?: అనుష్క ఫైర్‌

31 Oct, 2019 19:31 IST|Sakshi

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మకి టీ కప్‌లు అందివ్వడానికి సెలక్టర్లు పని చేశారని మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ వరల్డ్‌కప్‌ సమయంలో అనుష్కకు టీ కప్‌లు ఇస్తూ భారత సెలక్టర్లు కనిపించారని విమర్శించాడు. ఇదొక మిక్కీ మౌస్‌ సెలక్షన్‌ కమిటీ అని, కోహ్లి చెప్పినట్లు వినే ఒక చేతగాని కమిటీ అంటూ ఫరూక్‌ మండిపడ్డారు. దీనిపై అనుష్క శర్మ ఒక సుదీర్ఘ లేఖ ద్వారా స్పందించారు. భారత జట్టులో ఏది జరిగినా దానికి తనను ఆపాదిస్తూ ఉండటం గత కొంతకాలంగా చూస్తున్నానని,  ఎప్పుడు ఏమి జరిగినా కామ్‌గా ఉండిపోవడం తప్పితే దేనికీ స్పందించ లేదన్నారు.  తన మౌనంలో నిజాలు మరుగన పడిపోతున్నాయనే ఉద్దేశంతోనే ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. భారత క్రికెట్‌లో జరిగిన ప‍్రతీ దానికి తననే టార్గెట్‌ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. (ఇక్కడ చదవండి: అనుష్కకు టీ కప్‌లు ఇవ్వడానికి వెళ్లారా?)

‘వారు(విమర్శలు చేసేవారు) చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే పునరావృతం అవుతూ ఉంది. అదొక నిజంలా మొత్తం ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న వార్తలు చూసి నేను భయపడుతున్నా. నేను ప్రతీదానికి మాట్లాడకుండా ఉంటే పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి ఈ రోజైనా ముగింపు దొరకాలి. నా బాయ్‌ ఫ్రెండ్‌, భర్త కోహ్లి ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. దీనిపై కోహ్లి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉన్నాడు. నేను అప్పుడు కూడా సైలెంట్‌గానే ఉన్నా. అనవసరమైన కట్టుకథల్లోకి తరచు నా పేరును లాగుతున్నారు.  మీ అందరికీ నేనే దొరికానా. అసలు జరిగిన వాస్తవాలను మరుగన పడేస్తున్నారు. కోహ్లి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నా సొంత ఖర్చులతోనే నేను అక్కడికి వెళుతున్నా.  ఎవరైనా అడిగిన క్రమంలో గ్రూప్‌ ఫోటోకి ఫోజిచ్చినా నన్నే విమర్శిస్తున్నారు. ఈ వార్తలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. అందుకే మౌనం వీడాల్సి వచ్చింది. ప్రతీ విషయంలోనూ అనవసరంగా నా పేరు లాగొద్దు. వాస్తవాలను మాట్లాడండి.. ఆధారాలతో మాట్లాడండి.. నన్ను ఇక్కడితో వదిలేయండి’ అంటూ అనుష్క ఒక లేఖను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు