సింధుకు ఘన సత్కారం

13 Sep, 2019 16:28 IST|Sakshi

విజయవాడ:  ఇటీవల జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికారిత సంస్థ ఘనంగా సత్కరించింది. శుక్రవారం తుమ్మల పల్లి కళాక్షేత్రంలో సింధును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబులతో పాటు రాష్ట్ర తెలుగు భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, సింధు తల్లి దండ్రులు వెంకట రమణ, విజయలు హాజరయ్యారు.

వీరితో పాటు పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కె ప్రవీణ్‌ కుమార్‌, శాప్‌ స్పోర్ట్స్‌ ఎండీ కాటంనేని భాస్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె మాధవీలత తదితరులు సింధు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.  పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాస రావు మాట్లాడుతూ..  పీవీ సింధు సాధించిన విజయం తెలుగు ప్రజల విజయంగా అభివర్ణించారు. ఆమెకు భవిష్యత్ ప్రయత్నాలలో మరిన్ని విజయాలు సమకూరాలన్నారు

ఒదిగి ఎదిగితే సింధు అవుతారు..
సింధు ఎన్నో త్యాగాలు, కష్టాలు ఫలితమే  ప్రపంచ చాంపియన్‌ రూపంలో కనబడిందని మంత్రి కురసాల కన్నబాబు కొనియాడారు. తెలుగు వారి కీర్తిని విశ్వ విఖ్యాతం చేసిన సింధు గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుందన్నారు.  ఒక తెలుగు అమ్మాయి ఏది అనుకుంటే అది సాధించగలరని సింధు నిరూపించారన్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు తల్లి దండ్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.  పీవీ సింధులు  ఎంతోమంది ఉన్నారని, భవిష్యత్తులో  మరిన్ని పథకాలు రావాలని కోరుకుంటున్నానని కురసాల తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రోత్సహించే విధంగా మౌలిక వసతుల కల్పించాలని సీఎం ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

>
మరిన్ని వార్తలు