‘ధోనికి రిటైర్మెంట్‌ ఆలోచనే లేదు’ 

19 Jul, 2019 19:44 IST|Sakshi

ముంబై : టీమిండియా సీనియర్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోనికి ఇప్పట్లో రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచనే లేదని అతడి అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అరుణ్‌ పాండే స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌ అనంతరం ధోని రిటైర్మెంట్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో అరుణ్‌ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. శుక్రవారం అరుణ్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పట్లో రిటైర్మెంట్‌ తీసుకోవాలనే ఆలోచన ధోనికి లేదు. అతడు వ్యక్తిగతంగా కంటే జట్టు ప్రయోజనాల కోసం ఎక్కువగా ఆలోచిస్తాడు. కానీ ఓ గొప్ప ఆటగాడి భవిష్యత్‌పై ఇలాంటి వార్తలు రావడం దురదృష్టకరం’అంటూ పేర్కొన్నాడు. 

ఇక ఆదివారం వెస్టిండీస్‌ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేయడానికి సెలక్టర్లు సమావేశమవుతున్నారు. దీంతో ధోనిని ఎంపిక చేస్తారా లేదా పక్కకుపెడతారా అనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి కొంత కాలం క్రికెట్‌ ఆడటానికి ధోని ఇష్టపడుతుండటంతో అతడిపై సెలక్టర్లు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక ప్రపంచకప్‌లో బెస్ట్‌ ఫినిషర్‌గా విఫలమైన ధోనిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇక క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు