అశ్విన్‌కు కొత్త బాధ్యతలు

26 Feb, 2018 16:18 IST|Sakshi
రవిచంద్రన్‌ అశ్విన్‌(ఫైల్‌ఫొటో)

న్యూఢిల్లీ: రాబోవు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎంపిక చేశారు. ఈ మేరకు అశ్విన్‌కు కెప్టెన్‌గా కీలక బాధ్యతలు అప్పచెబుతున్న విషయాన్ని కింగ్స్‌ పంజాబ్‌ యాజమాన్యం సోమవారం ప్రకటించింది. గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడిన అశ్విన్‌ను..ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో కింగ్స్‌ దక్కించుకుంది. అశ్విన్‌కు రూ. 7.60 కోట్లు చెల్లించి కొనుగోలు చేసిన కింగ్స్‌.. అతనిపై నమ్మకం ఉంచుతూ సారథ్య బాధ్యతల్ని కూడా అప్పచెప్పింది.

అంతకుముందు కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరిగిన వేలంలో మ్యాక్స్‌వెల్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కొనుగోలు చేసింది. దాంతో జట్టుకు ఎవర్ని కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే దానిపై పలు తర్జన భర్జనల తర్వాత అశ్విన్‌కు ఆ బాధ్యతలు అప్పచెబుతూ కింగ్స్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఐపీఎల్లో ఏ జట్టుకు కెప్టెన్‌గా చేయని అశ్విన్‌.. తొలిసారి సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నాడు. దీనిపై అశ్విన్‌ మాట్లాడుతూ.. తనను కెప్టెన్‌గా ఎంపిక చేసి కొత్త బాధ్యతల్ని అప్పచెప్పడం ఒక గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. ఇదొక ఛాలెంజ్‌ తీసుకుని జట్టును ముందుకు తీసుకెళతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు