క్వార్టర్స్‌లో సాయిదేదీప్య, శివాని

12 Jun, 2014 01:07 IST|Sakshi

ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయిలు సాయిదేదీప్య, అమినేని శివాని, శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చండీగఢ్‌లోని సీఎల్‌టీఏ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శివాని 6-1, 6-0తో పాశ్చల్‌పై అలవోక విజయం సాధించగా, శ్రీవల్లి రష్మిక 2-6, 6-4, 6-2తో ఏడో సీడ్ పాన్యబాలపై చెమటోడ్చి నెగ్గింది.
 
 ఇతర పోటీల్లో టాప్ సీడ్ సాయిదేదీప్య 4-6, 6-2, 6-3తో అయేషా పటేల్‌పై గెలుపొందగా, ఆరో సీడ్ ప్రింకిల్ సింగ్ 6-3, 6-1తో శ్రావ్య శివానిని ఓడించింది. నాలుగో సీడ్ మహక్ జైన్ 6-0, 6-0తో శరణ్య షెట్టిపై, ప్రకృతి భన్వాని 6-0, 6-1తో నికితా దేవిపై, ఆర్.జాదవ్ 6-1, 6-1తో అశ్‌ప్రీత్ కౌర్‌పై, ఈశ్వరి మాటెరే 6-2, 6-4తో కుశ్‌బీన్ కౌర్‌పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించారు.
 
 బాలికల అండర్-14 డబుల్స్ తొలిరౌండ్‌లో శ్రీవల్లి-పాన్యబాల జోడి 6-7, (4/7), 7-6 (7/4), 10-5తో అశ్‌ప్రీత్‌కౌర్-అలీషా మీనన్ జంటపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. సాయి దేదీప్య-మహక్ జైన్ జోడికి, ప్రింకిల్ సింగ్-శివాని జంటకు తొలి రౌండ్లో బై లభించింది. ఈశ్వరి మాటెరే-అయేషా పటేల్ ద్వయం 6-1, 6-0తో ఐశ్వర్య- ఎస్.మెహతా జోడిపై, తనీషా బన్సాల్-రియా జంట 6-2, 6-2తో హిమాద్రి- నిఖిత జోడిపై, శ్రావ్య శివాని-శరణ్య షెట్టి జోడి 6-3, 6-2తో ప్రకృతి-రితూజా జాదవ్ జంటపై, కుశ్‌బీన్ కౌర్-రాహ మంగత్ జంట 6-3, 6-2తో ప్రియాంక-బిందు జోడిపై గెలుపొందాయి.
 

మరిన్ని వార్తలు