కాంటినెంటల్‌ కప్‌కు నీరజ్, హిమ దాస్‌

29 Jul, 2018 02:20 IST|Sakshi

ఆసియా పసిఫిక్‌ టీమ్‌కు ఎంపిక

న్యూఢిల్లీ: కాంటినెంటల్‌ కప్‌లో పాల్గొనే ఆసియా పసిఫిక్‌ జట్టుకు ఏడుగురు భారత అథ్లెట్లు ఎంపికయ్యారు. ఇందులో స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా, స్ప్రింట్‌ సంచలనం హిమ దాస్‌ సహా మొహమ్మద్‌ అనస్‌ (400 మీ.), జిన్సన్‌ జాన్సన్‌ (800 మీ.), అర్పిందర్‌ సింగ్‌ (ట్రిపుల్‌ జంప్‌), పి.యు.చిత్ర (1500 మీ.), సుధా సింగ్‌ (3000 మీ. స్టీపుల్‌చేజ్‌) ఉన్నారు. అంతర్జాతీయ ఈవెంట్‌లలో కనబరిచిన మెరుగైన ప్రదర్శన, ఐఏఏఎఫ్, ఆసియా పసిఫిక్‌ ర్యాంకింగ్స్‌లో మెరిట్‌ ఆధారంగానే ఈ ఏడుగుర్ని ఎంపిక చేసినట్లు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎఫ్‌ఐ)కు ఆసియా అథ్లెటిక్స్‌ సంఘం (ఏఏఏ) కార్యదర్శి మారిస్‌ నికోలస్‌ తెలియజేశారు. ఐఏఏఎఫ్‌ కాంటినెంటల్‌ కప్‌ చెక్‌ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావాలో సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో జరగనుంది. ఈ కప్‌ 2010లో ప్రారంభమైంది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈవెంట్‌ జరుగుతుంది. ఇందులో ఆఫ్రికా, అమెరికా, ఆసియా పసిఫిక్, యూరోప్‌ జట్లు తలపడతాయి.  

మరిన్ని వార్తలు