ప్రియాంకకు పసిడి

27 Jun, 2013 06:35 IST|Sakshi

 మోహన్‌కు కాంస్యం
 ఆసియా యూత్ చెస్
 
 విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక మెరిసింది. బాలికల అండర్-12 విభాగం బ్లిట్జ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించడంతోపాటు స్టాండర్డ్ విభాగంలో రజత పతకం దక్కించుకుంది. ఇరాన్‌లో బుధవారంతో ముగిసిన ఈ టోర్నీలో ఈ విజయవాడ అమ్మాయి స్టాండర్డ్ చెస్‌లో మొత్తం 9 రౌండ్లకు ఆరు విజయాలు, రెండు డ్రాలు, ఒక పరాజయంతో 7 పాయింట్లు సాధించింది. చివరి రౌండ్‌లో ప్రియాంక... ఈ టోర్నీలో ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన యాంగ్ యిజింగ్ (చైనా)పై విజయం సాధించింది.
 
 బ్లిట్జ్ ఈవెంట్‌లో ప్రియాంక ఆరు పాయింట్లు సంపాదించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ర్యాపిడ్ విభాగంలో రజత పతకం సాధించిన మరో విజయవాడ అమ్మాయి పొట్లూరి సుప్రీత 5.5 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. అండర్-10 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కుశాగ్ర మోహన్ కాంస్య పతకాన్ని సాధిం చాడు. 9 రౌండ్లకుగాను మోహన్ ఆరున్నర పాయిం ట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 16 దేశాల నుంచి 305 మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు