సెమీస్‌లో ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజి

11 Jan, 2014 00:40 IST|Sakshi

జింఖానా, న్యూస్‌లైన్: ఎస్‌ఆర్ చాంపియన్స్ ట్రోఫీలో ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజి 4 వికెట్ల తేడాతో ఎస్‌వీఎస్‌ఐటీ (వరంగల్) జట్టుపై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌వీఎస్‌ఐటీ 14.5 ఓవర్లలో 76 పరుగులు చేసింది.
 
 రాజ్‌కుమార్ (49) మెరుగ్గా ఆడాడు. ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజి బౌలర్లు అరవింద్, సైదులు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం బరిలోకి దిగిన ఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజి 16.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసి నెగ్గింది. కిరణ్ 29 పరుగులు చేశాడు.
 
 ఎస్‌వీఎస్‌ఐటీ బౌలర్ సాంకీత్ రెండు వికెట్లు చేజిక్కించుకున్నాడు. రాజ్ కుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మరో మ్యాచ్‌లో వీజేఐటీ ఇంజనీరింగ్ కాలేజి జట్టు 20 పరుగుల తేడాతో ఎంఎల్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్ కాలేజి జట్టుపై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వీజేఐటీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. శివదీప్ (82) అర్ధ సెంచరీతో రాణించాడు. ఎంఎల్‌ఆర్‌ఐటీ బౌలర్లు అఖిల్, ప్రసాద్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. తర్వాత బరిలోకి దిగిన ఎంఎల్‌ఆర్‌ఐటీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. వినోద్ (30) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. వీజేఐటీ బౌలర్లు లక్ష్మణ్, వికాస్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వీజేఐటీ బ్యాట్స్‌మన్ శివదీప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
 

మరిన్ని వార్తలు