భారత ఓటమిని ముందే చెప్పిన జ్యోతిష్యుడు!

12 Jul, 2019 10:13 IST|Sakshi
జ్యోతిష్యుడు బాలాజీ హసన్‌ (ఇన్‌సెట్‌ సర్కిల్‌లో)

హైదరాబాద్‌ : ప్రపంచకప్‌లో భారత్‌ పోరాటం సెమీస్‌తో ముగిసింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన కోహ్లిసేన సెమీస్‌లో మాత్రం పరిస్థితులు అనుకూలించక న్యూజిలాండ్‌కు తల వంచింది. 240 పరుగుల సాధారణ లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది. అభిమానులకు తీరని గుండె కోతను మిగిల్చింది. అయితే భారత్‌ సెమీస్‌లో ఓడుతుందని ఓ జ్యోతిష్యుడు ఆరు నెలల ముందే తెలియజేశాడు. అతను చెప్పినట్లు భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు వెళ్లడం.. ఇప్పుడు చర్చనీయాంశమైంది. బాలాజీ హసన్‌ అనే సదరు జ్యోతిష్యుడు ఓ టీవీ చానెల్‌ క్యార్యక్రమంలో భాగంగా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు అందరని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జనవరిలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను హీరో మాధవన్‌ ఇన్‌స్టాగ్రాంలో పంచుకోగా ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఈ వీడియోలో ఏముందంటే..  2019 ప్రపంచకప్‌లో ఏ జట్టు గెలుస్తుందని యాంకర్‌ ప్రశ్నించగా.. ఇది చాలా కష్టమైన ప్రశ్ననని పేర్కొన్న బాలాజీ హసన్‌.. ఇప్పటి వరకు గెలవని జట్టు సొంతం చేసుకుంటుందని సమాధానమిచ్చాడు. భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయని, భారత్‌.. న్యూజిలాండ్‌ లేక ఇంగ్లండ్‌తో సెమీస్‌ ఆడుతుందన్నాడు. టైటిల్‌ మాత్రం న్యూజిలాండ్‌ గెలుస్తుందని, మ్యాన్‌ఆఫ్‌ది సిరీస్‌ కేన్‌ విలియమ్సన్‌ను వరిస్తుందన్నాడు. ఇక అతను చెప్పినట్లుగానే న్యూజిలాండ్‌.. భారత్‌తో గెలిచి ఫైనల్‌ చేరింది. ఇక మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ రేసులో కేన్‌ విలియమ్సన్‌, జోరూట్‌కు అవకాశాలున్నాయి. అత్యధిక పరుగుల జాబితాలో రోహిత్‌ శర్మ (648) టాప్‌స్కోరర్‌గా ఉండగా.. డేవిడ్‌ వార్నర్‌ 647 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి కథ సెమీస్‌ పోరుతో ముగియడంతో తరువాతి స్థానాల్లో నిలిచిన జోరూట్‌ (549), కేన్‌ విలియమ్సన్‌ (548)కు అవకాశం ఉంది. ఫైనల్లో ఎవరు సెంచరీ సాధిస్తారో వారు మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలవనున్నారు.

మరిన్ని వార్తలు